*వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులపై దాడులు* – *ఆటవిక పాలనకు నిదర్శనం..*
*వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి*

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా నిలుస్తున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఘటనలు నియోజకవర్గంలో ఆటవిక రాజ్యాన్ని తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మట్కా, గంజాయి బ్యాచ్లు, ముసుగు దొంగలు సిగ్గు విడిచి బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజలపై దాడులకు పాల్పడటం అత్యంత సిగ్గుచేటు చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామం చెరువు ముందరపల్లెకు చెందిన రామచంద్రపై కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.ఈ దాడులకు పాల్పడిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం, జిల్లా కేంద్రం తరలిపోయిందని బాధతో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టిన వారిపై హత్యాయత్నాలు చేయడం ఎందుకు? సాధారణ కార్యకర్తలపై దాడులు చేయడం ఏ రకమైన రాజకీయమని ప్రశ్నించారు.నాపైన దాడి చేస్తారో, హత్య చేస్తారో రండి. అంతేగానీ మా కార్యకర్తలపై, ప్రజాసంఘాలపై దాడులు చేయడం పిరికిపంద చర్య. ముసుగులు వేసుకున్నా, తీసేసుకున్నా రావచ్చు. కానీ ఇలాంటి చిల్లర దాడులు ప్రజాస్వామ్యంలో సహించబోవు అని హెచ్చరించారు.ఇలాంటి ఘటనలు పెరుగడానికి పోలీసు వ్యవస్థ గట్టిగా వ్యవహరించకపోవడమే ప్రధాన కారణం అని ఆరోపించారు. చూసీ చూడనట్లు వ్యవహరించే ధోరణి వల్లనే అక్రమాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికార పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న మనోవేదనకు తోడుగా నిలవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, మీడియాను బెదిరిస్తూ దాడులకు పాల్పడిన వారి మనుగడే లేకుండా పోయిందన్నారు. సంబేపల్లె గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి సహా పార్టీ అనుచరులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించడం అనుచితమని అన్నారు. అక్రమాలు, అన్యాయాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే దానికి పోలీసులే బాధ్యత వహించాల్సిఉంటుందని శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
