
*మొంథా తుఫాను వలన నీటమునిగిన వరి పంట*
*ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి*
పులిచర్ల, నవంబర్ 01:
మొంథా తుఫాను ప్రభావంతో పులిచర్ల మండలంలోని పోశంవారిపల్లె పంచాయతీ దిన్నుపాటివారిపల్లె గ్రామ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గ్రామ చెరువుకు సమీపంలోని పొలాల్లో రైతులు వేసిన వరి పంటలు వర్షాల వలన నీటమునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నీటమునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రామనాథం, చంగయ్య, కృష్ణమ్మ, వేణు మరియు బాధిత రైతులు ఎల్లంకివారిపల్లె వీఆర్వో, మండల వ్యవసాయ అధికారిని కలిసి అర్జీ సమర్పించారు. నష్టాన్ని పరిశీలించి, తక్షణమే ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆవేదనపై అధికారులు స్పందించి, అవసరమైన నివేదికలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాలని స్థానికులు కోరుతున్నారు.
