
*ఏపీ అసెంబ్లీలో సత్యవేడు సమస్యలు*
✍️ *పరిష్కారం కోరుతూ సభలో ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిమూలం*
✍️ *సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లకు ఎమ్మెల్యే వినతి*
సత్యవేడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిని, స్మశానం సమస్యలను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం ఏపీ అసెంబ్లీలో ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తన సత్యవేడు నియోజకవర్గంలో 36 రోడ్లు మంజూరు అయ్యిందన్నారు.
ఎన్డిబి ద్వారా నాగలాపురం నుండి చిన్నపాండూరు వరకు రూ.40 కోట్లు, బుచ్చినాయుడు కండ్రిగ నుండి సూళ్లూరుపేట వరకు రూ.12 కోట్లు పనులు సైతం రామచంద్రారెడ్డి కాంట్రాక్టర్ దక్కించుకొని పనులు చేపట్టలేదని ఆరోపించారు.
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన సత్యవేడు తమిళనాడుకు సరిహద్దుగా ఉందని, తాను మండలాల్లో తిరగాలన్నా తమిళనాడు లోపల వెళ్లాల్సిందేనని వాపోయారు.
కరోనా సమయంలో తనను కూడా తమిళనాడు ప్రభుత్వం రాకపోకలకు అనుమతించలేదని, ప్రజలతో పాటు తాను కూడా తీవ్రంగా ఇబ్బంది పడినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇందుకోసం దాసుకుపం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేశారని, ప్రస్తుతం అది పరిశీలనలో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
తన నియోజకవర్గంలో మొత్తం 36 రోడ్లను అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంట్రాక్టు దక్కించుకొని కేవలం 6 రోడ్లను మాత్రం వేసి మిగిలిన వాటిని చేయకుండా వదిలేశారన్నారు.
చివరికి రోడ్లు వేయకపోవడానికి కారణం తానేనని తనపై నెపం నెట్టి తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనను దేవుడులా ఆదుకొని, తనకు టికెట్టు కేటాయించి, ఎమ్మెల్యే చేసిన మహోన్నత వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు అంటూ ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు.
ఇప్పుడిప్పుడే రోడ్లన్నింటికీ మరమ్మత్తులు జరుగుతున్నాయని, మంజూరు ఆగిపోయిన రోడ్లను కూడా నిర్మించాలని ఎమ్మెల్యే సభ దృష్టికి తెచ్చారు.
అలాగే తమ నియోజకవర్గంలో స్మశానాలు, స్మశానాలకు రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం దయవుంచి తమ నియోజకవర్గంలోని స్మశానాలు, వాటికి అవసరమైన రోడ్లు నిర్మాణం చేపట్టి ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆ మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వినతి పత్రం సమర్పించారు

