పర్యాటకంగా గంగమ్మ ఆలయాభివృద్ధి కి సహకారం అందిస్తాం…

శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ను దర్శించుకున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ యాదవ్..
తిరుపతి, జనవరి 6:
పర్యాటకంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా టూరిజం శాఖ తరపున సహకరిస్తామని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ తెలిపారు. మంగళవారం శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ యాదవ్ తో పాటు కుటుంబ సభ్యులకు శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనార్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్, గంగమ్మ గుడి పాలకమండలి సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాశస్త్యాన్ని, ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను బాలాజీకి చైర్మన్ మహేష్ యాదవ్ వివరించారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ అమ్మవారి పసుపు, కుంకుమతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు ఆసక్తి చూపుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి దిశగా ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఆ దిశగా కోట్ల రూపాయలు నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు.. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఆలయాల సందర్శనకు వచ్చే పర్యాటకులు, భక్తుల నిమిత్తం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని కూడా ఆలయ దర్శినిలో చేర్చే విధంగా ప్రత్యేక చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఏవి ఏమైనా రానున్న రోజుల్లో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి టూరిజం శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.
