విషపూరిత రంగునీటి డైయింగ్ పరిశ్రమలను వెంటనే తరలించాలి లేదా మూసివేయాలి – నగరిలో ప్రజల డిమాండ్

నగరి:
నగరి నియోజకవర్గం, నగరి మున్సిపాలిటీ పరిధిలో గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న విషపూరిత రసాయన రంగునీటి డైయింగ్ పరిశ్రమల వల్ల ప్రజల జీవితం తీవ్రంగా ప్రభావితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైయింగ్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రంగునీరు భూగర్భ జలాల్లో కలవడంతో ఫ్లోరైడ్ మోతాదు పెరిగి తాగునీరు ఉప్పునీరుగా మారిందని వారు ఆరోపిస్తున్నారు.
ఈ సమస్యపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లా కలెక్టర్, నగరి ఆర్డీవో, తాసిల్దార్, మున్సిపల్ కమిషనర్, పర్యావరణ శాఖ, ఇరిగేషన్, RWS, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు మెమోరాండం సమర్పించినట్లు తెలిపారు. అయినా పరిస్థితి మారకపోవడంతో ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు.
డైయింగ్ పరిశ్రమల కాలుష్యం కారణంగా
వ్యవసాయ పంటల దిగుబడి తగ్గి నాణ్యతలేని పంటలు పండుతున్నాయని,
ఆర్గానిక్ వ్యవసాయం పూర్తిగా నాశనం అయిందని,
బుద్ధిమాందిత సమస్యలతో పిల్లలు పుట్టే పరిస్థితి ఏర్పడుతోందని,
పరిశ్రమల నుంచి వెలువడే విషపూరిత స్లజ్ ఎక్కడికి తరలిస్తున్నారో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారని తెలిపారు.
అలాగే టీబీ, డయేరియా, క్యాన్సర్, కిడ్నీ, లివర్, చర్మ వ్యాధులు, షుగర్, బీపీ, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. పశుపక్ష్యాదులు మరణిస్తుండగా, చెరువులు పూర్తిగా విషపూరితంగా మారి చేపలు కూడా తినరాని స్థితికి చేరాయని చెప్పారు. భూగర్భ జలాలు, తాగునీరు, సాగునీరు పూర్తిగా కలుషితమయ్యాయని, కీళ్ల నొప్పులు, జాయింట్ నొప్పులు సాధారణ సమస్యలుగా మారాయని పేర్కొన్నారు.
జనావాస ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లు కూడా చేరలేని చోట్ల డైయింగ్ బాయిలర్లు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని వారు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ప్రాంతానికి డైయింగ్ పరిశ్రమలను వెంటనే తరలించి, తమిళనాడులో అమలులో ఉన్నట్టుగా ‘జీరో లిక్విడ్ డిస్చార్జి (ZLD) సిస్టం’ను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల యజమాన్యాల పర్యవేక్షణలో మాత్రమే డైయింగ్ పరిశ్రమలు నడవాలని, లేకపోతే వాటిని పూర్తిగా మూసివేయాలని నగరి ప్రజలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. 5.1.25 సోమవారం ఉదయం పదిగంటలకు నగరి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ జరుగును , ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
