తిరుమల, 2025 నవంబర్ 21
శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి గౌ|| శ్రీమతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు.
ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ
శ్రీ భూ వరహస్వామివారిని దర్శించుకున్నారు.
అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న గౌ|| రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం గౌ|| రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో గౌ||రాష్ట్రపతికి వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో శ్రీవారి చిత్ర పటాన్ని తీర్థప్రసాదాలను, టీటీడీ 2026 క్యాలెండర్, డైరీలను గౌ|| రాష్ట్రపతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి జానకి దేవి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఇతర జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.
————————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
