*సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం*

ఇప్పటికే ఏపీలో స్త్రీ శక్తి పథకం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ పథకానికి రూ.400 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ పథకం ప్రారంభం నుంచి.. ఇప్పటివరకు అయిన ఖర్చులకు సంబంధించి ఆర్టీసీకి నిధులను విడుదల చేశారు. దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్త్రీ శక్తి పథకం నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో గతేడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద.. రాష్ట్రంలోని మహిళలు అందరికీ.. ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ స్త్రీ శక్తి పథకాన్ని.. చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి అప్రతిహతంగా ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన నిధులను ఏపీ ప్రభుత్వం.. ఆర్టీసీకి విడుదల చేసింది. ఈ మేరకు ఆగస్ట్ 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల వరకు.. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అయిన ఖర్చును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) కి చెల్లించింది. మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నప్పటికీ.. వారికి బస్సుల్లో జీరో టికెట్లు ఇస్తున్నారు. ఈ జీరో టికెట్ల ఆధారంగా.. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులను చెల్లిస్తూ ఉంటుంది. అయితే ఆగస్ట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆర్టీసీకి ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో తాజాగా 3 నెలల జీరో ఫేర్ టికెట్ల ఖర్చుకు సంబంధించిన రూ.400 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. ఇందులో రెండున్నర నెలల్లో ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం కోసం జీరో టికెట్లు జారీ చేసిన మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీకి నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఆర్టీసీ ఎన్ఎంయూఏ, అలాగే ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
