
*కామధేను వాహనం పై కైలాసనాథుని కటాక్షం*
✍️ *భక్తిప్రపత్తులతో యాగశాల పూజలు*
✍️ *ఉభయదారులుగా చెన్నై రేవతి నరసింహులు కుటుంబం*
నాగలాపురం మండలం సురుటుపల్లి లో శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిత్య వాహన సేవలు అంగరంగ వైభవంగా జరుగుతోంది.
అందులో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం ఉదయం 5 గంటలకు యాగశాల పూజ, 10 గంటలకు శ్రీ పార్వతీ, పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు అభిషేకం, సాయంత్రం 4 గంటలకు యాగశాల పూజ, పూర్ణాహుతి క్రతువులు ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుక్కల్ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయంలో స్వయంభు వెలసిన శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, శ్రీ మరగదాంబిగా అమ్మవారికి, శ్రీ దాంపత్య దక్షిణామూర్తి కి, శ్రీ పల్లి కొండేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సాయంత్రం 7 గంటలకు కామధేను వాహనం పై శ్రీ కైలాస నాధుని, పల్లకి వాహనంలో శ్రీ పార్వతీ దేవిని అధీష్టించి పరిమళాలు వెదజల్లే పుష్పాలు, స్వర్ణ ఖచిత ఆభరణాలతో అందంగా అలంకరించి విశేష పూజలు చేసి, వివిధ రకాల హారతులు సమర్పించారు.
రాత్రి 8 గంటలకు వేదమంత్రోత్సరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు భాణాసంచా శబ్దాల నడుమ కామధేను వాహనంలో స్వామి, పల్లకిలో అమ్మవారు ఊరేగుతూ భక్తులను సమ్మోహనపరిచారు.
కామధేను సేవ ఉభయదారుగా చెన్నైకి చెందిన రేవతి నరసింహులు కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గ్రామోత్సవంలో కోలాట భజనలు, ఆలయ మండపంలో చిన్నారుల భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.
ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విద్యుద్దీపాలంకరణలు, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్ లు దేద్వీపమానంగా వెలుగొందుతోంది.
శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ లత, సిబ్బంది పర్యవేక్షించారు.

