
వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా శుక్రవారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

