
*ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు’.. మంత్రి లోకేశ్ ఆన్ ద ఫైర్..* కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష పార్టీలే కాదు అధికార కూటమిలోని పార్టీల నాయకులు కూడా పోలీసులపై విరుచుకుపడుతున్నారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పోలిట్బ్యూరో సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున నాయకులు వస్తుండడంతో టీడీపీ కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు నిర్వహించారు. వంద, 200కు పైగా పోలీసు సిబ్బంది మొహరించారు. కార్యాలయంలోకి వెళ్లే వారిని పకడ్బందీగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. అయితే తనిఖీలతో టీడీపీ కార్యర్తలు, నాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం నారా లోకేశ్ దృష్టికి రావడంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఉన్నత అధికారులను పిలిపించి నారా లోకేశ్ మాట్లాడారు. పార్టీ సామావేశానికి ఇంత మంది పోలీసులు అవసరమా అని ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఇది జగన్ ప్యాలెస్ కాదయ్యా’ అంటూ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే టీడీపీ నాయకులను బందోబస్తు పేరుతో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. నామమాత్రపు బందోబస్తు కల్పిస్తే చాలు అని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మరోసారి పోలీసులపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీశ్ వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోందనే ప్రచారం జరుగుతోంది. ఏ సందర్భమైనా పోలీస్ శాఖను తప్పుబడుతుండడంతో పోలీస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే రాజకీయాల కోసం తమను ఇబ్బంది పెట్టడం సరికాదని కొందరు పోలీస్ అధికారులు తమ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నట్లు సమాచారం.
