
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ్యురిచ్ లోని హిల్డన్ హోటల్ లో స్విస్ పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏడునెలల క్రితం ఏర్పాటైన ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను అమలు చేస్తోందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటుచేసే సంస్థలకు 15రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్ రంగాల్లో అధునాతన ఆవిష్కరణల కోసం ఎపి విశ్వవిద్యాలయాలతో కలసి స్విస్ పరిశోధన సంస్థలు కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఎపిలో స్టార్టప్ లను ప్రోత్సహించడం, సాంకేతికత బదిలీల కోసం ఇన్నోవేషన్ హబ్, ఇంక్యుబేటర్లు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో స్విస్ వెకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మోడల్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఎపి యువతలో నైపుణ్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. పూణేలో గెబిరిట్ తరహాలో ప్లంబింగ్ ల్యాబ్లు, శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
