Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

బిడ్డల విద్యపై… దృష్టి లేని తల్లిదండ్రులు…. సామాన్యుల కు అందని వైద్యం.. ప్రజారోగ్యానికి భరోసా లేదు… వైద్యవిద్య కూడా… రాజకీయమే…

బిడ్డల విద్యపై… దృష్టి లేని తల్లిదండ్రులు….

సామాన్యుల కు అందని వైద్యం..

ప్రజారోగ్యానికి భరోసా లేదు…

వైద్యవిద్య కూడా… రాజకీయమే…

 

ఇంజనీరు, డాక్టరు చదువంటే గతంలో గొప్ప…. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం ఉండేది!

ఫలానా వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు.. మెడిసిన్‌ చదువుతున్నారు.. అంటూ గొప్పగా చెప్పుకొనేవారు.

ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత మంచి కొలువులూ దొరికేవి. అలాంటి ఇంజనీరింగ్‌ విద్యలో క్రమంగా నాణ్యత తగ్గిపోయింది! ఫీజురీయింబర్స్‌మెంట్‌ కోసం ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్‌ కాలేజీలు పెట్టడంతో సాంకేతిక విద్యలో నాణ్యత కొరవడింది. బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు ప్రస్తుతం చిన్న చిన్న ఉద్యోగాలు.. చివరికి డెలివరీ బాయ్స్‌గాను, క్యాబ్‌ డ్రైవర్లగానూ పనిచేస్తున్నారు. చాలా మందికి అలాంటి ఉపాధి కూడా దొరకడం లేదు!

ఇప్పుడు వైద్య విద్య పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలు దేవుళ్లుగా భావించే వైద్యులను తీర్చిదిద్దే మెడికల్‌ కళాశాలల్లో పరిస్థితులు దైవాధీనంగా మారాయి!

ఇదిఅరకొర వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది కొరత, నాణ్యత లేని చదువుతో.. పరీక్షలు పాసై, పట్టాలు పుచ్చుకొని బయటకు వస్తున్న వైద్యులకు కనీస పరిజ్ఞానం లేని పరిస్థితులు నెలకొంటున్నాయి! ఇంజనీరింగ్‌ కాలేజీల మాదిరిగానే.. ఇటీవలి కాలంలో వైద్యవిద్య కళాళాలలనూ ఏర్పాటు చేసేస్తున్నారు.

 

కొత్త కాలేజీలను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేస్తుండడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ‘జనాభా-వైద్యుల’ నిష్పత్తికి మించి డాక్టర్లు ఉన్నారు!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ప్రతి 1000 మందికి జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 681 మందికే ఓ వైద్యుడు ఉండడం విశేషం!!

ప్రభుత్వాలు మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై చూపుతున్న శ్రద్ధ.. వాటిలో నాణ్యమైన విద్యను అందించడంపై మాత్రం చూపడం లేదు. ఫలితంగా ఆయా కళాశాలల్లో చదివిన వైద్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. రేకుల షెడ్లు, గోడౌన్లలో మెడికల్‌ కాలేజీలు నడుస్తున్నాయి.

మృతదేహాలను కోయకుండా, విషయ పరిజ్ఞానం లేకుండానే డాక్టర్లు అయిపోతున్నారు! ఎంబీబీఎస్‌ చదివినా.. సాధారణ శస్త్రచికిత్సలు కూడా చేయలేకపోతున్నారు.

ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో నిబంధనలకు తగినట్లుగా అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఉండడం లేదు. అడ్డగోలుగా ఏర్పాటైన కాలేజీల్లో రోగులు, విద్యార్థులు ఉంటున్నారు తప్ప.. వారికి విద్యాబుద్ధులు నేర్పే గురువులు ఉండడం లేదు.

పెద్ద సంఖ్యలో ఏర్పాటైన కాలేజీల కారణంగా ఏటా వేల సంఖ్యలో మెడికోలు బయటకు వచ్చి, నిరుద్యోగులుగా మారుతున్నారు. కొంత మందికి అవకాశాలు దక్కినా.. వేతనాలు మాత్రం అరకొరగానే ఉంటున్నాయి. నాణ్యమైన బోధన లేకుండా వైద్య పట్టాలు పుచ్చుకొని వృత్తిలోకి అడుగుపెట్టే డాక్టర్లతో ప్రజల ప్రాణాలకూ ముప్పే!

రాబోయే దశాబ్ద కాలంలో మన రాష్ట్రంలో ఇంజనీర్ల కంటే డాక్టర్ల సంఖ్యే ఎక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య కళాశాలలపై

ప్రభుత్వ, ప్రైవేటులో 50-60% ప్రొఫెసర్ల కొరత

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత 50 నుంచి 60 శాతం వరకు ఉందని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు. సర్కారీ కాలేజీల్లో అధ్యాపకులను కాంట్రాక్టు పద్ధతిలో రెట్టింపు జీతం ఇచ్చి తీసుకుంటామని పదేపదే నోటిఫికేషన్లు ఇచ్చినా ఎవరూ రావడం లేదు.

గత ఏడాది జూన్‌ నుంచి డిసెంబరు మధ్య కాలంలో సర్కారీ కాలేజీలన్నీ వరుసగా అధ్యాపకుల కోసం నోటిఫికేషన్లు ఇచ్చాయి. అయినా పూర్థిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం పెరిగిన కాలేజీలకు తగ్గట్లుగా వైద్యవిద్యను బోధించే వారు పెరగకపోవడమే! ఉన్న వాటిలోనే అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండగా.. కొత్త కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అధ్యాపకులను ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. డీఎంఈ పరిఽధిలో మానవ వనరుల కొరత ఉందని ఈ ఏడాది కాగ్‌ ఇచ్చిన నివేదికలోనూ వెల్లడైంది. డీఎంఈలో 56 శాతం మేరకు మానవ వనరుల కొరత ఉన్నట్లు కాగ్‌ పేర్కొంది. ఇక ప్రైవేటులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ అధ్యాపకులున్నారో లేరో కూడా తెలియదు.

వైద్య విద్య…అధికార, విపక్ష రాజకీయ నేతలవే..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఇబ్బడిముబ్బడిగా వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రైవేటులో ఉన్న వాటిలో 95 శాతం అధికార, విపక్ష రాజకీయ నేతలవే. అందులో కనీస సౌకర్యాలు, అధ్యాపకులు లేకున్నా.. అడిగే నాథుడే లేరు. ఈ విషయంలో జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)ని కూడా ‘మేనేజ్‌’ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

దేశంలో తగినంత మంది అధ్యాపకులు ఉన్నారా? లేదా? అని చూడకుండా కేంద్రం అడ్డగోలుగా మెడికల్‌ కాలేజీలను మంజూరు చేస్తోంది. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 60 కాలేజీలుండగా, 8715 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 18 ప్రభుత్వ కళాశాలలు మరియు 19 ప్రైవేట్ కళాశాలలతో సహా 37 వైద్య కళాశాలలు. 2025-26 నాటి కి మరో 7 కళాశాల లను సిద్ధం చేసింది..ఆంధ్రప్రదేశ్‌లో 36 మెడికల్ కాలేజీల్లో 6,366 సీట్లు ఉన్నాయి.  ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 2,773 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 3,100 సీట్లు ఉన్నాయి.  డాక్టర్ Y.S.R యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (YSRUHS) ప్రభుత్వ కళాశాలల్లో 85% రాష్ట్ర కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగిలిన 15% సీట్లకు MCC కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

గురువులు లేని వైద్య విద్య… అందరూ ఏకలవ్యులే..

తగినంత మంది అధ్యాపకులు లేక నాణ్యమైన వైద్యవిద్య అందడం లేదు. మరి కొద్ది ఏళ్లలో మనదగ్గర ఏటా పదివేల మంది ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. వారిలో ఎంత మందికి ఉపాధి దొరుకుతుందనేది ప్రశ్నార్థకమే!

మరోవైపు మనదగ్గర 2544పీజీ సీట్లే ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్‌ పూర్తి చేసేవారిలో కేవలం 26 శాతం మందికే సీట్లు దక్కుతాయి. దాంతో రానురాను సీటు దక్కించుకునే అవకాశాలు మరింత సన్నగిల్లుతాయి.

80% వైద్య కళాశాలల్లో కనీస ప్రమాణాలు కరువు!

NMC అధికారులే చెబుతున్నారు…

ఇంతకన్నా సిగ్గు చేటు ఉందా…?

దేశంలో మన తెలుగు రాష్ట్ర లలో ప్రతి అయిదు వైద్య కళాశాలల్లో నాలుగు కళాశాలలో (80 శాతం) జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిర్దేశించిన కనీస ప్రమాణాలనైనా పాటించడం లేదు.

దేశవ్యాప్తంగా సుమారు 700 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా.. ఎన్‌ఎంసీ అధికారుల నిర్వహిస్తున్న తనిఖీల్లో అనేక కళాశాలల డొల్లతనం బయటపడుతోంది.

కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, అధ్యాపకుల గైర్హాజరుతో పాటు విద్యార్థులకు తగినన్ని హాస్టళు లేకపోవడం, ర్యాగింగ్‌ వంటి సమస్యలను వారు గుర్తిస్తున్నారు.

నిబంధనలు, ప్రమాణాలు పాటించని కళాశాలలకు రూ.10 లక్షల నుంచి రూ.50 వరకు జరిమానాలు విధిస్తున్నారు. రూ.కోటి వరకు జరిమానా విధించిన సందర్భాలూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయినా ప్రమాణాలు మెరుగుపర్చుకోని కళాశాలల్లో సీట్ల సంఖ్యపై కోత విధిస్తున్నారు.

పాపం ఎన్‌ఎంసీదే..

వైద్యవిద్య కళాశాలల్లో ప్రమాణాలు పడిపోవడానికి ఎన్‌ఎంసీ ప్రధాన కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా ఇబ్బడిముబ్బడిగా కొత్త ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసేస్తోంది.

కళాశాలలు పెట్టిన తర్వాత కూడా తనిఖీలు చేయడం లేదు. గత ఏడాది దేశవ్యాప్తంగా ఒక్క మెడికల్‌ కాలేజీ గుర్తింపు రద్దు కాలేదంటేనే ఎన్‌ఎంసీ పర్యవేక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏటా సీట్ల కోత, కాలేజీల గుర్తింపు రద్దులాంటివి జరిగేవి. కానీ తొలిసారి ఒక్క సీటు కూడా కోత పడకపోవడం గమనార్హం. పైగా ఎన్నడూ లేని జరిమానా విధానాన్ని ప్రవేశపెట్టింది.

వైద్యవిద్యలో ప్రమాణాలు దిగజారిపోవడానికి ఎన్‌ఎంసీ కారణమని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు. పలు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో రోజూ కనీసం వంద మంది కూడా అవుట్‌ పేషెంట్లు ఉండడం లేదు. సర్జరీలు జరిగేదీ లేదు. అయినప్పటికీ ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌కు దొంగ లెక్కలు చూపుతున్నాయి. అలాగే పీజీలు, హౌస్‌సర్జన్లతో తప్పుడు కేస్‌షీట్లు రాయిస్తున్నారు. చేయని సర్జరీలను చేసినట్లు చూపుతున్నారు. కొన్ని కాలేజీలకు అసలు రోగులే రావడం లేదు. మరికొన్ని కాలేజీలు ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీలకు వచ్చినప్పుడు నకిలీ రోగుల్ని తీసుకొస్తున్నాయి.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, పీజీలు చేసి బయటకొచ్చిన వారు మళ్లీ కార్పొరేట్‌ లేదా ఇతర ఆస్పత్రుల్లో చేరి మెళకువలు నేర్చుకుంటున్నారు.

ప్రైవేటులో అధ్యాపకులు రావడం లేదన్నది బహిరంగ రహస్యం. కొద్దిమంది అధ్యాపకులే వస్తుంటారు. వారి బయోమెట్రిక్‌ హాజరు కోసం నకిలీ వేలిముద్రలు తయారుచేసి, అదే కాలేజీలోని అటెండర్ల చేత వేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

వైద్యవిద్యలో పాఠ్యపుస్తకాల కంటే ప్రాక్టికల్‌గా నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే వైద్యవిద్యపై పట్టు లభిస్తుంది. గతంలో మెడికోలు బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేసుల్ని చూసేవారు. అలాగే రోజూ రెండు, మూడు శస్త్రచికిత్సల్లో సహాయకులుగా పనిచేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటి మెడికోలు సర్జరీలను కూడా ఆన్‌లైన్‌లో చూసి నేర్చుకుంటున్నారు….

ఇక చాలా ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు మృతదేహాలు దొరకని పరిస్థితి ఉంది. ప్రైవేటు కాలేజీలకు ఎమర్జెన్సీ కేసులే రావు. అటువంటి చోట చదువుకున్నవారు.. ఎమర్జెన్సీ కేసుల్ని ఎలా డీల్‌ చేయగలుగుతారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పీజీ గైనకాలజీ చేసిన వారు సైతం సిజేరియన్‌ ఆపరేషన్‌ చేయలేకపోతున్నారు.

నిరుద్యోగ వైద్యులు..!!

రాష్ట్రంలో ప్రతి ఏటా…నిరుద్యోగ వైద్యుల (ఎంబీఎఎస్‌) సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1,32,216 మంది డాక్టర్లు ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కొత్తగా 32 వేల మంది వైద్యులు రాష్ట్ర వైద్యమండలిలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులకు కేవలం రూ.25-30 వేల జీతమే ఇస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ, మేనేజ్‌మెంట్‌ కోటాలో రూ.కోటికి పైగా పెట్టి చదివినా.. వారి ఖర్చులకూ సంపాదించుకునే పరిస్థితి లేదు.

@ తలిదండ్రులు గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయవలసిన అంశాలు… ఇది మన భాధ్యత…

నియామకాలే కాదు.. పోస్టింగూ ముఖ్యమే

కొత్త మెడికల్‌ కాలేజీల్లో శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలి. ఎప్పటికప్పుడు పదోన్నతులు ఇవ్వాలి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసే వెసులుబాటు కల్పించాలి. అధ్యాపకులు కొరుకున్న చోట పోస్టింగ్‌ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంత కాలేజీల్లో పనిచేసేవారికి అదనపు ప్రోత్సాహకాలివ్వాలి.

ప్రస్తుతం అధ్యాపకులకిచ్చే వేతనాలకు శాశ్వత పద్ధతిలో ఎంపిక చేసినా తగినంత మంది రారు. అందుకే అధ్యాపకుల వేతనాలను పెంచాలి. డిమాండ్‌ ఉన్న సబ్జెక్టులకు ఇంకా ఎక్కువ వేతనమివ్వాలి. ప్రొఫెసర్లకు వేతనాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు లేదా ప్రోత్సాహకాలు ఇస్తేనే దీర్ఘకాలికంగా వారు బోధనావృత్తిలో కొనసాగుతారు. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది.

అధ్యాపకుల లభ్యత ఆధారంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ, గత ప్రభుత్వం రాజకీయ కోణంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ అంటూ వీటిని ప్రారంభించింది.

కొత్తగా మెడికల్‌ కాలేజీ ప్రారంభించాలంటే వాటిలోని సీట్ల ఆధారంగా ఎంతమంది అధ్యాపకులుండాలనేదానిపై ఎన్‌ఎంసీ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది.

వైద్య కళాశాలల్లో మొత్తం 22 విభాగాలుంటే వాటిలో క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ ఉంటాయి. నాన్‌ క్లినికల్‌లో అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్‌లో. క్లినికల్‌లో రేడియాలజీ, డెర్మటాలజీలదీ వివిధ విభాగాలలో అధ్యాపకులు అసలు లేని పరిస్థితిలో NMC దీనిపై తక్షణమే అన్ని విభాగాల లో అధ్యాపకుల నియామకాలు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలో జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి

మరిన్ని విషయాలు మరల…

*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*

*(రిజిస్టర్ నెంబర్ 6/2022)*

*ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.*

Related posts

_శ్రీశైలంలో ఐదవ రోజు స్కంద మాత దుర్గా  అలంకరణ

Garuda Telugu News

శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి పరామర్శ

Garuda Telugu News

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పోలీసుల ఆధ్వర్యంలో డిజిటల్ జియో ట్యాగ్ సదుపాయం

Garuda Telugu News

Leave a Comment