తిరుమల, 2025 సెప్టెంబర్ 26
బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మెరుగైన వైద్య సేవలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద తెలిపారు.
తిరుమలలోని రామ్ భగీచా-2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో అశ్వినీ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారితో కలిసి శుక్రవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 50 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారని తెలిపారు.
తిరుమలలో సాధారణ రోజుల్లో 10 అంబులెన్స్ లు అందుబాటులో ఉన్నాయని, బ్రహ్మోత్సవాలకు అదనంగా 4 అంబులెన్స్ లను భక్తులకు అత్యావసర వైద్యం అందించేందుకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
మాడ వీధుల్లోని 4 కార్నర్లలో ఒక్కో అంబులెన్స్ ను ఏర్పాటు చేశామని, వాహన సేవ వెనుక మరో అంబులెన్స్ ఉంటుందని తెలిపారు. గరుడసేవ రోజున మాడవీధుల్లోని కార్నర్లలో 20 మంది సీనియర్ డాక్టర్లు, 20 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు వైద్యం అందిస్తారని పేర్కొన్నారు. 2 బ్యాటరీ వాహనాల ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈసారి బ్రహ్మోత్సవాల్లో సీనియర్ సిటిజన్ల షెడ్డు వద్ద 12 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న 12 డిస్పెన్సరీలతో పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు అదనంగా ముఖ్యమైన ప్రాంతాల్లో 10 డిస్పెన్సరీలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.
——————-
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
