
*ఉద్యోగులకు సంక్రాంతి కానుక..!*
_ కీలక బిల్లులకు ఆమోదం
అమరావతి, iBN :సీఎం చంద్రబాబు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు కీలక బిల్లులకు ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ స్థితిగతులు, పెండింగ్ బిల్లుల విడుదల పై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసు శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో చిన్నస్థాయి పనులు చేసి పదేళ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వడం పై సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. సమీక్ష అనంతరం పలు పెండింగ్ బిల్లులు, బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. GPFకు రూ.519కోట్లు, CPSకు రూ.300కోట్లు, TDSకు రూ.265కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.241కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.788కోట్లు, 26 వేల మంది కాంట్రాక్టర్లకు రూ.506కోట్లు, 651 కంపెనీలకు రూ.90కోట్ల రాయితీ, విద్యుత్ శాఖకు రూ.500కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.400కోట్లు, రైతుల కౌలు బకాయిలకు రూ.241 కోట్లు రిలీజ్ చేయనున్నారు.
